కాంగ్రెస్ పార్టీ గెలిచిన రెండు సీట్లలో పార్టీ కన్నా వ్యక్తులే ప్రభావం చూపినట్లు తెలుస్తొంది. ఈ స్థానాలలో విజయం వెనుక పార్టీ ప్రతిష్ట కంటే వ్యక్తిగత సంబంధాలు సామాజిక వర్గమే బాగా పనిచేశాయనే వ్యాఖ్యలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చిరంజీవి పట్టుబట్టి నర్సాపురం రామచంద్రాపురం స్థానాలలో తన సామాజికవర్గానికి చెందిన కొత్తపల్లి సుబ్బారాయుడు తోట త్రిమూర్తులకు టిక్కెట్లు ఇప్పించారు. వీరి విజయం వెనుక చిరంజీవి పరోక్ష ప్రయత్నం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గాల్లో తెదేపా నుండి కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వారు పోటీ చేసినా వారు భవిష్యత్ రాజకీయాల్లో కొనసాగలేరన్న భావనతోనే ఈ సామాజికవర్గానికి చెందిన వారంతా ఏకమై ఈ ఇద్దరి విజయానికి తీవ్రంగా కృషి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నర్సాపురం రామచంద్రాపురం నియోజకవర్గాలలో ఏ ఎన్నికలు జరిగినా రెండు మూడు ప్రధాన కులాల మధ్య పోరు సాగుతూనే ఉంటుంది. ఇక్కడ కుల ధన ప్రవాహంతోనే నాయకులు గెలుస్తారు. ఈసారి గెలిచిన అధికారపార్టీ అభ్యర్ధులు ఇద్దరూ గతంలో టిడిపి ప్రరాపా పార్టీలలో పట్టున్న నేతలుగా ఎదిగినవారే. అయితే తాజా పోరులో పార్టీ కంటే వ్యక్తిగత ప్రతిష్టతో వారిద్దరూ గట్టెక్కినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఉప ఎన్నికల్లో కుల సమీకరణల ఆధారంగా కాంగ్రెస్ టిడిపి పార్టీలు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకే సీట్లు ఇచ్చినప్పటికీ అంచనాలు తారుమారయ్యాయి. కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు చీలకుండా ఆ సామాజికవర్గానికి చెందిన వారంతా అంతర్గతంగా ఏకమై పార్టీలను పక్కనపెట్టి వ్యక్తిగత ప్రతిష్ట కలిగిన తోట కొత్తపల్లిలకు పట్టం కట్టారు. రామచంద్రాపురంలో టిడిపి అభ్యర్ధి చిక్కాల రామచంద్రరావు నర్సాపురంలో టిడిపి అభ్యర్ధి డాక్టర్ చినమిల్లి సత్యనారాయణ లిద్దరూ వృద్ధనేతలు. ఈ అంశం కాంగ్రెస్ పార్టీకి ప్లస్పాయింట్గా కలిసొచ్చింది. ఇక్కడ కాపు సామాజికవర్గాన్ని ఏకం చేయడానికి ఇదే ప్రధానం కారణంగా కూడా కనిపిస్తోంది. గత 30 ఏళ్ళగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నర్సాపురం రామచంద్రాపురం నియోజకవర్గాలు ఉండేవి. అయితే 2009 ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంతో కుల సమీకరణలు మారాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో చిరంజీవి సామాజిక వర్గం ప్రాబల్యం అధికంగా ఉన్నప్పటికీ 2009లో ప్రరాపా తరపున పోటీ చేసిన తోట త్రిమూర్తులు కొత్తపల్లి సుబ్బారాయుడు ఓటమి పాలయ్యారు. ఇటీవల చిరంజీవి కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేయడంతో ఈ రెండు నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం కాంగ్రెస్ వైపు మొగ్గుచూపింది. నర్సాపురం నియోజకవర్గంలో కొత్తపల్లి సుబ్బారాయుడు టిడిపిలో ఉన్నంత కాలం కాంగ్రెస్ నేతలను ఎదగనివ్వలేదు. ఈ కారణంగా ఈసారి ఎన్నికల్లో సుబ్బారాయుడుకి వ్యతిరేకంగా పనిచేయాలని పాత తరం కాంగ్రెస్ నేతలు భావించినప్పటికీ కులం కారణంగా ఏకం కావడం తప్పలేదు. రామచంద్రాపురంలో కూడా ఇదే పరిస్థితి. తోట వ్యతిరేకులంతా కులం కారణంగా ఏకమై ఆయనకు అనుకూలంగా విజయానికి కృషి చేశారు. రామచంద్రాపురంలో ఒకసారి టిడిపి మరోసారి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టేవారు. అయితే కులం కారణంగా 2009లో కాంగ్రెస్ అభ్యర్ధి పిల్లి సుభాష్చంద్రబోస్ను ఆయన సామాజిక వర్గీయులంతా ఏకమై గెలిపించారు. ఈసారి కులం ఒక కారణంగా కాగా సుభాష్చంద్రబోస్పై ఉన్న వ్యతిరేకత కూడా తోట త్రిమూర్తులకు కలిసివచ్చిన అంశం. అలాగే జిల్లాలో మంచి పేరున్న టిడిపి అభ్యర్ధి చిక్కాల రామచంద్రరావు గతంలో తాళ్ళరేవు నియోజకవర్గం నుండి 5సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. అయితే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా తాళ్ళరేవు నియోజకవర్గం కాకినాడ అర్బన్లో కలిసిపోయింది. దీంతో ఆయనకు నియోజకవర్గం లేకుండా పోయింది. ఈ తరుణంలో రామచంద్రాపురంలో సరైన టిడిపి అభ్యర్ధి లభించకపోవడంతో చిక్కాలను బలవంతంగా టిడిపి పోటీకి దించింది. చిక్కాల పోటీకి విముఖంగా ఉండటం స్థానికేతరుడు కావడం కూడా ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కలిసొచ్చింది
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:congress, party, won, Political, Entertainment, Telugu
|